All Books

నెహెమ్యా 10

1.మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా

2.శెరాయా అజర్యా యిర్మీయా

3.పషూరు అమర్యా మల్కీయా

4.హట్టూషు షెబన్యా మల్లూకు.

5.హారిము మెరేమోతు ఓబద్యా

6.దానియేలు గిన్నెతోను బారూకు

7.మెషుల్లాము అబీయా మీయామిను

8.మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు

9.లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు

10.వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను

11.మీకా రెహోబు హషబ్యా

12.జక్కూరు షేరేబ్యా షెబన్యా

13.హోదీయా బానీ బెనీను అనువారు.

14.జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ

15.బున్నీ అజ్గాదు బేబై

16.అదోనీయా బిగ్వయి ఆదీను

17.అటేరు హిజ్కియా అజ్ఞూరు

18.హోదీయా హాషుము బేజయి

19.హారీపు అనాతోతు నేబైమగ్పీ

20.యాషు మెషుల్లాము హెజీరు

21.మెషేజ బెయేలు సాదోకు యద్దూవ

22.పెలట్యా హానాను అనాయా

23.​హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు

24.​రెహూము హషబ్నా మయశేయా

25.​అహీయా హానాను ఆనాను

26.మల్లూకు హారిము బయనా అనువారు.

27.అయితే జనులలో మిగిలినవారు,

28.అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయు లగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.

29.వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.

30.మరియుమేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయువారి కుమార్తెలను మా కుమా రులకు పుచ్చుకొనకయు నుందుమనియు

31.​దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందు మనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సర ములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.

32.మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.

33.​సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయ శ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.

34.మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.

35.మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి

36.మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.

37.ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.

38.​లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,

39.​ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.